ఆపరేషన్ 'హైడ్రా' చర్యలు ప్రారంభంలో కఠినంగా ఉన్నప్పటికీ..! ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో విఫలం.
టిజి-బిపాస్ చట్టం ..! హైడ్రా ఆవిర్భావం..! అమలు విధానం సరైనదే అయినప్పటికీ..!
#రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలై పోతుందనే నెపంతో..! పొలిటికల్ స్టంట్గా మారిందా..?
హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణల అంశాలపై హైడ్రా నిర్లక్ష్యం దేనికి సంకేతం..?
చెరువుల కబ్జాలతో..! చెరువులను తలపిస్తున్న మహానగరం రహదారులు..
హైదరాబాద్ మహానగరం ముంపుకు ఇరిగేషన్, జీహెచ్ఎంసి పుణ్యమే..!
ప్రమాదకర అక్రమ కట్టడాలు ప్రోత్సహించేదే జీహెచ్ఎంసి, హెచ్ఎండిఏ..
చెరువులు, నాలాల కబ్జాలపై ముడుపులకే ప్రాధాన్యత ఇస్తున్న ఇరిగేషన్..
గత పాలకుల నిర్వాకం,అవినీతి మయంగా అధికార యంత్రాంగం..!
అదుపు చేయలేక విసిగెత్తిన ప్రస్తుత ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా ఏర్పాటు..
అయినప్పటికీ సిస్టమ్ క్షీణించింది..! అవినీతి పెట్రేగి పోతోంది..!అస్తవ్యస్తంగా నియంత్రణ వ్యవస్థ..
చారిత్రాత్మక చెరువులు, కుంటలు, కట్టుకాలువలు, ప్రధాన నాలాల కబ్జాల్లో అధికారులదే కీలకపాత్ర..?
ప్రభుత్వ ఖజానాకు చేరాల్సినవి కూడా.. తమ ఖాతాలో జమకోసమే అధికారుల ఆరాటం..?
అక్రమార్కులకి తప్పుడు సలహాలు సూచనలతో ప్రభుత్వ ఆస్తులు కనుమరుగు..
చివరికి ఒక అధికారి పోస్టింగ్ కూడా.. స్థానిక శాసనసభ్యుని అనుమతి కావాల్సిన దుస్థితి..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 18:
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల గ్రామ పరిధిలోని ఫాక్స్సాగర్ చెరువు 1897లో నాటి బ్రిటిష్ పాలకులు త్రాగునీటి కోసం నిర్మించినట్లు స్థానికులు చెపుతున్న నిజం.. 1899లో మూసీనదిని కలిపే అత్యంత వెడల్పుతో ఫాక్స్సాగర్ నాలాను నిర్మించిన శిలాపలకం నేటికీ చూడవచ్చు.. ప్రముఖ ప్రజాప్రతినిధి ధనాపేక్ష..! సంబంధిత నాలుగు శాఖల నిర్వాకం (రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసి, విద్యుత్) తో చారిత్రాత్మక చెరువు కబ్జాదారుల కబంద హస్తాల్లో బందిగా ఉంది.. ముఖ్యంగా నీటిపారుదల శాఖలోని అవినీతి అధికారుల చేతివాటానికి బలై పోతోంది.. జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారులు నాలా బఫర్ జోన్లోనే నిర్మాణ అనుమతులు వారిలోని అవినీతిని బయటపడుతుంది.. కస్టోడియన్గా వ్యవహరించే రెవెన్యూ శాఖ, నిబంధనలను పట్టించుకోకుండా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని..! టిజిఎస్పిడిసిఎల్పై మొన్నటి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు ప్రత్యేక నిదర్శనం.. ఈనాలుగు శాఖలపై విజిలెన్స్ వ్యవస్థలో ఏ ఒక్కరు స్పందించక పోవడంలో ఆంతర్యం..? ఈ శాఖల పనితీరు నచ్చకనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలో భాగమైన "ఆపరేషన్ హైడ్రా" ఏర్పాటు చేసినప్పటికీ..! చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు యధావిధిగా కొనసాగుతుండటం పలు ఆరోపణలకు తావిస్తోంది..
జీహెచ్ఎంసీలో అవినీతి..? నీరసించిన విజిలెన్స్ విభాగం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో అవినీతి తాండవిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులు, నాలాల ఆక్రమణలు, అక్రమ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి అక్రమాలకు అధికారులు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని, హైకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమవుతుండగా..! ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో విజిలెన్స్ విభాగం తన ఉనికిని కోల్పోతూ..! విధుల్లో పారదర్శకత కనిపించడం లేదు.. ఈ నేపథ్యంలో, ఫాక్స్సాగర్ నాలా ఆక్రమణ కేసు ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది..
జీహెచ్ఎంసి వైఫల్యంతో..నాలాపై నిర్మాణ అనుమతులు..
ఫాక్స్సాగర్ నాలా ఆక్రమణ వ్యవహారంలో అక్రమంగా నిర్మాణ అనుమతులు ఈ శాఖల నిర్వాకాన్ని బట్టబయలు చేస్తోంది.. అధికారుల సహకారంతో చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయి.. టౌన్ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన, పర్యవేక్షణ చేయకపోవడం, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఆక్రమణలకు దారితీస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.. ఫాక్స్సాగర్ నాలాపై "తిరుమల హైట్స్" అపార్ట్మెంట్..! జేకేనగర్లో నాలా బఫర్ జోన్లో, కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 నుండి 4 నిర్మాణ అనుమతులు మంజూరు టౌన్ప్లానింగ్ అధికారి అవినీతికి అద్దం పడుతుంది.. తాజాగా నాలాపైనే నిర్మించిన మార్వాడి షాపింగ్ కాంప్లెక్స్కి మొదట 3 పర్మిషన్లు మంజూరు చేసిన జీహెచ్ఎంసి సర్కిల్-25, మళ్ళీ రద్దచేసింది.. 2024 ఆగష్టు 16న సీజ్ చేసింది.. చివరికి, చట్టాలను అడ్డుపెట్డుకుని, నిర్మాణం పూర్తి చేయడానికి కూడా జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారులే కీలకంగా సహకరించడం విశేషం.. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది..
అక్రమ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు..! విజిలెన్స్ నిఘా వైఫల్యం..?
జీహెచ్ఎంసీలో విజిలెన్స్ విభాగం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.. హైడ్రా ఏర్పాటు తర్వాత విజిలెన్స్ సిబ్బంది బల్దియాకు రిపోర్టు చేయకపోవడం, హైడ్రాకే పరిమితమై, విజిలెన్స్ నిఘా కొరవడుతుందని ఆరోపణలు ఉన్నాయి.. ఈ నాలుగు శాఖల అధికారుల నిర్వాకంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు, నాలాల ఆక్రమణలతో వరదలతో ముంపు సమస్య తీవ్రమవుతుండగా..! సందిట్లో సడేమియా అన్నట్లు ఆక్రమణ దారుల అక్రమ కట్టడాలకు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి, మరింత బలం చేకూరుస్తున్నారు.. కేవలం విద్యుత్ కనెక్షన్లతో చెరువులు, చారిత్రక నాలాలు క్రమబద్ధీకరణకు కీలకంగా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే..
ఫాక్స్సాగర్ నాలా బఫర్లో 4 పర్మిషన్లు..
జేకేనగర్ లేఅవుట్లో కబ్జాకు గురైన, పార్కుస్థలం ఫాక్స్సాగర్ బఫర్ జోన్లో ఉందని, వెంచర్ నిర్వాహకుడు వి.కృష్ణమూర్తి, లేఅవుట్ చేసినప్పుడే, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా, పార్కు స్థలంగా కేటాయించారు.. జేకే నగర్లో ఫాక్స్సాగర్ నాలా పక్కనే (బఫర్ జోన్లో) ఉన్న ఈ పార్కు స్థలానికి జీహెచ్ఎంసి సర్కిల్-25 పట్టణ ప్రణాళిక నుండి నాలుగు నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.. కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు 2021 ఫిబ్రవరిలో ఒకసారి..! 2022 అక్టోబర్ 31న మరోసారి ఈ నిర్మాణాలను కూల్చివేశారు.. అయితే, గతంలో కూల్చిన చోటనే, తాజాగా మళ్ళీ నిర్మాణాలు చేపట్టడంపై, రెవెన్యూ, ఇరిగేషన్ బహిరంగంగానే సహకరిస్తున్నారు.. అప్పుడు అక్రమం, ఇప్పుడు సక్రమం ఎలా అయిందో జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులే తేల్చాలి.. అయితే వెంచర్కి స్థలం విక్రయించిన కుటుంబీకుల, వారసులే ఈ కబ్జాలకు పాల్పడటం కొస మెరుపు..
అక్రమ పర్మిషన్లు రద్దు చేయక పోవడానికి కారణం..?
జేకేనగర్ పార్కు స్థలం కబ్జాలో అధికారుల తీరు స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తుంది.. జీహెచ్ఎంసి సర్కిల్-25 నిర్వాకంతో.. సైట్ వెరిఫికేషన్లో నాలాను చూపించకుండానే 4 నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.. సంబంధిత అక్రమ పర్మిషన్లు రద్దు చేయకపోవడం విశేషం..! ఈ వ్యవహారంలో నీటిపారుదల శాఖ వ్యవస్థ ఉందా, లేదా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. 2020-21లో జీహెచ్ఎంసీ సర్కిల్-25 అధికారులు సైట్ వెరిఫికేషన్లో ఫాక్స్సాగర్ నాలాను పరిగణనలోకి తీసుకోకుండా (నాలాను ఇతరుల స్థలంగా చూపిస్తూ) నాలుగు నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.. గత నాలుగేళ్లలో రెండుసార్లు అక్రమ నిర్మాణాలను కూల్చినప్పటికీ, తాజాగా అదేచోట నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో, మూడు శాఖలు వెనకడుగు వేస్తున్నారు.. అక్రమంగా మంజూరు చేసిన అనుమతులను కూడా రద్దు చేయలేదు.. హైకోర్టు ఆదేశాలను సాకుగా చూపిస్తూ, కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. పిటిషనర్ ఒకవేళ ఆక్రమణకు పాల్పడినట్లు రుజువైతే పిటిషనర్పై అధికారులు తీసుకునే చర్యలను ఈ హైకోర్టు నిరోధించదని ఆర్డర్లో స్పష్టతను ఇచ్చింది.. అయినప్పటికీ, ఈ కోర్టు ఆదేశాల సాకుతో, అధికారులు చర్యలకు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు..