నర్సీపట్నం, పెన్ పవర్ :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నంలోని గల పవిత్ర ఉత్తరవాహిని వద్ద ఆదివారం రాత్రి ‘నదికి హారతి’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు పాల్గొని నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిని సమర్పించారు. వారణాసి గంగా హారతి తరహాలో నిర్వహించిన ఈ వేడుకను చూసేందుకు పురజనులు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనుల పండుగగా, భక్తిశ్రద్ధలతో ఈ గంగా హారతి కార్యక్రమం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతోందని, అన్నవరం వెళ్లడం కుదరని భక్తులు ఇక్కడే స్వామివారి వ్రతాలు చేయించుకోవచ్చని సూచించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఇవి పూర్తి కానున్నట్లు తెలిపారు.
ఇదే ప్రాంగణంలో ఈశ్వరయ్య బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మంచు శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దివ్యశ్రీ దంపతులు, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, పలువురు టిడిపి, జనసేన నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.