చింతపల్లి,పెన్ పవర్,జనవరి 20: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతంలో జాతీయ రహదారిపై అధిక వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని చింతపల్లి ఎఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు. మంగళవారం ఉదయం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కొందరు యువకులు మోటార్సైకిళ్లపై హల్చల్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.ఇలాంటి వారిని గుర్తించి పట్టుకుని చట్టపరంగా శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని సరైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
చింతపల్లి సీఐ వినోద్బాబు, ఎస్సైలు వీరబాబు, ఎం. వెంకటరమణ ఆధ్వర్యంలో వారపు సంతలు, జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చలానాలు తప్పవని ఎఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.