అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..!

బహుదూర్‌పల్లి బాబాఖాన్ లేక్ఐడి నెం.2856 నాలాను కబ్జాదారులకు అప్పగింత..!

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..!

ఒక్కరోజు కురిసిన భారీవర్షానికే.. హైదరాబాద్ నగరం రోడ్లపై పడవల్లో తిరుగుతున్న అధికార యంత్రాంగం, హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువుల కబ్జాలపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నాలా కబ్జా పరిశీలనలో భాగంగా, బహుదూర్‌పల్లి ప్రైమార్క్ కబ్జాను (2025 మార్చి 13న సందర్శించి.. నాలా కబ్జాను గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చర్యలు తీసుకోక పోగా.. ఆక్రమణ దారుల ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లకు "మార్చి 19న" హెచ్ఎండిఏ నుండి "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" ఇవ్వడం గమనార్హం.. 2000 గజాల బాబాఖాన్ చెరువు నాలా స్థలాన్ని ఆ నాలుగు శాఖలు అమ్ముకున్నారా..? నాలా ఉన్నట్టు "పాత చిత్రాల" ఆధారాలు, రెవెన్యూ, ఇరిగేషన్ జాయింట్ సర్వే నివేదికలతో "పెన్ పవర్" దినపత్రికలో గత మూడేళ్ళుగా వార్తా కథనాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. చివరికి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఆ నాలుగు శాఖల  అధికారులు అనుకున్నదే చేశారు..! ఈ వ్యవహారంతో ప్రైమార్క్ కబ్జాదారుల నుండి తీసుకున్న ముడుపులకు, న్యాయం చేశారని స్పష్టమవుతుంది.. చెరువు నాలా కబ్జాకు గురైందనే దానికంటే..! ఒప్పందం ప్రకారం కబ్జాదారునికి అప్పగించామనే సంతృప్తిని అధికారులకు మిగిల్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీపై, హైకోర్టును ఆశ్రయించిన, విల్లాల బాధితుల అభ్యంతరం చెప్పకపోవడంలో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. నాలా ఆక్రమణ బాధితుల మౌనంపై భిన్న కథనాలు వస్తున్నాయి..వారిని కూడా మేనేజ్ చేశారేమో అంటూ ఆరోపణలు లేకపోలేదు..

ZomboDroid_14092025112922
చెరువునాలాపై రోడ్డు అవతల ప్రైమార్క్ కబ్జా..! రోడ్డు ఇవతల అక్రమ షెడ్డుతో కబ్జా..!

 

దుండిగల్‌ రెవెన్యూ సర్వేయర్ శ్రీనివాస్ చారి 2019లో తప్పుడు స్కెచ్‌ప్లాన్‌తో షురూ..

 

ప్రైమార్క్‌‌కి హెచ్ఎండిఏ అనుమతులకు కీలకంగా మారిన సర్వేయర్ స్కెచ్‌ప్లాన్..

 

ఇక ఇరిగేషన్ అధికారుల సంగతి తెలిసిందే కదా..! చెరువుల కబ్జాల్లో కీలకపాత్ర..

 

వాల్టా యాక్ట్‌ను అమలు చేయాల్సిన నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం..!*

 

*ప్రైమార్క్ ఆక్రమణలో చెరువు నాలా రెండు వేల గజాల స్థలంలో ఎ-బ్లాక్ టవర్‌..

 

కబ్జా దారులు ప్రైమార్క్ నిర్మాణ సంస్థ వద్ద తీసుకున్న ముడుపులకు తలొగ్గి..?

 

నాలుగు శాఖలు ఒక్కటై..! అక్రమం సక్రమం అయ్యేవరకూ మూడేళ్ళు సర్వేలు..

 

"తిలాపాపం తలాపిడికెడు"గా ఆ నాలుగు శాఖల సమన్వయంతో నాలాపై ప్రైమార్క్..

 

 

 మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, సెప్టెంబర్ 14:

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చెరువులు, కుంటలు, కట్టుకాలువలు, ప్రభుత్వ భూముల పరిస్థితి దయనీయంగా మారింది.. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్టీలు వేరైనా పాలకుల ధ్యేయం ఒక్కటేనని రుజువైంది.. ఎటొచ్చీ ప్రజలే జోకర్‌‌లుగా భావిస్తున్నారు కాబోలు.. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన "నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం- నేటి కాంగ్రెస్ ప్రభుత్వం" తీరు ఒకేలా ఉంది..మరోవైపు ప్రభుత్వ శాఖల్లో, ఏడాదికి ఏడాది పారదర్శకత, నిజాయితీ లోపిస్తోంది..! అవినీతికి ప్రత్యామ్నాయంగా తయారైంది..! ఇదంతా బహిరంగమే అయినప్పటికీ..! "రాజకీయ నాయకులు- అధికారులు" ఒక్కటై దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే నానుడికి అద్దం పడుతున్నారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏ చెరువును పరిశీలించినా, ఏ కట్టుకాలువలు చూసినా బడా నిర్మాణ సంస్థల ఆధీనంలోనే భద్రంగా ఉండటం విశేషం.. ఎటొచ్చి సామాన్యులే సమిథలు అవుతున్నారు.. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే, అదేమి కాదు..! కొందరు తప్పుడు అధికారుల నేతృత్వంలోనే ఈ ప్రభుత్వ భూములు, చెరువులు, కట్టుకాలువలు, చెరువు నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి అనేది పచ్చి నిజం..! ఒక్క మాటలో చెప్పాలంటే..! అధికారులే ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే స్థాయికి దిగజారారు అనడంలో అతిశయోక్తి కాదు.. బీఆర్ఎస్ ధరణీ చట్టంతో దోచుకుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేసింది.. ధరణీ చట్టాన్ని తప్పుబట్టి, భూ భారతిని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ధరణీ లోపాలతో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది..?  

 

బహుదూర్‌పల్లి బాబాఖాన్ చెరువు నాలా భూ స్థాపితం..

 

దుండిగల్‌ మండలం, దుండిగల్‌ మున్సిపల్, బహుదూర్‌పల్లి గ్రామ పరిధిలోని బాబాఖాన్ లేక్ఐడి నెం.2856 చెరువు నాలాను భూ స్థాపితం చేశారు.. నాలుగు శాఖల లంచగొండి అధికారుల నేతృత్వంలో, చెరువు నాలా స్థలం కబ్జాకు, ప్రైమార్క్ హైరైజ్ టవర్‌ల నిర్మాణానికి, రోడ్డుకు అవతల తెరలేపగా..! అదే నాలా స్థలం (నేటి పత్రికలో నాలా దృశ్యాల స్థలంలో) రోడ్డుకు ఇవతల ఓ భారీ షెడ్డు నిర్మించారు.. ఈ వ్యవహారంలో ఒకవైపు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్..! మరోవైపు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తుంది.. వందల ఏళ్ళనాటి విలేజ్ నక్షలో ఉన్న ఈ చెరువు నాలా కబ్జాపై అధికారులు, తమ వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా, బడా నిర్మాణ సంస్థల ఆక్రమణలకు సహకరిస్తూ..! హైడ్రా విధివిధానాల్లో మార్పులు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం.. బహుదూర్‌పల్లి బాబాఖాన్ చెరువు నాలాను భూ స్థాపితం చేయడంలో  విజయవంతం అయ్యారని చెప్పాలి.. మానవ మనుగడకు ప్రమాదం తలపెట్టే విధంగా, తయ్యారైన ఈ అక్రమార్కులకు చెక్ పెట్టాలంటే..! ఒకటే పరిష్కారం..! బాధ్యులైన సంబంధిత శాఖల అధికారులను విధుల నుండి తొలగిస్తేనే, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు పరిరక్షింప బడుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts