లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గంగవరం ఎస్సై – కానిస్టేబుల్
gangavaram-si-constable-caught-by-acb-while-taking-bribe
పెన్ పవర్ క్రైమ్ డెస్క్ | పోలవరం జిల్లా – రంపచోడవరం నియోజకవర్గం
పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం పోలీస్ స్టేషన్లో అవినీతి బండారం బహిర్గతమైంది. అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులో ముద్దయి నుంచి లంచం డిమాండ్ చేసి, నగదు స్వీకరిస్తూ గంగవరం ఎస్సై బి. వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

పెన్ పవర్ క్రైమ్ డెస్క్ | పోలవరం జిల్లా
రంపచోడవరం నియోజకవర్గం పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం పోలీస్ స్టేషన్లో అవినీతి బండారం బహిర్గతమైంది. అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులో ముద్దయి నుంచి లంచం డిమాండ్ చేసి, నగదు స్వీకరిస్తూ గంగవరం ఎస్సై బి. వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
కేసు నేపథ్యం : గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని మొదటి భార్య గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఎస్సై వెంకటేష్ ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో కేసు విషయాన్ని సర్దుబాటు చేయాలంటే ₹20,000 ఇవ్వాలని ఎస్సై వెంకటేష్ డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే కేసును కఠినంగా నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, నగదు అందేంతవరకు శివకుమార్ సెల్ఫోన్ను తన వద్దనే ఉంచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.
ఏసీబీకి ఫిర్యాదు – ట్రాప్ ఆపరేషన్ : డబ్బు డిమాండ్పై విసిగిపోయిన శివకుమార్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ట్రాప్ ఆపరేషన్కు రంగం సిద్ధం చేసింది. ఏసీబీ అధికారులు ముందుగా పంచ్ సాక్షుల సమక్షంలో నగదు నోట్లపై రసాయన పౌడర్ (ఫీనాల్ఫ్తలీన్) పూసి బాధితుడికి అందించారు. గురువారం రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ముందుగా ప్లాన్ చేసిన విధంగా శివకుమార్ కానిస్టేబుల్ వీరబాబుకు ₹15,000 నగదు అందజేశాడు.
దాడి – పట్టుబడిన పోలీసులు : నగదు స్వీకరించిన వెంటనే అక్కడే గస్తీ కాస్తున్న ఏసీబీ అధికారులు దాడి చేసి కానిస్టేబుల్ వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. రసాయన పరీక్షల్లో ఆయన చేతులకు పౌడర్ ఆనవాళ్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. విచారణలో, ఎస్సై వెంకటేష్ సూచన మేరకు తాను డబ్బు తీసుకున్నట్లు వీరబాబు వెల్లడించినట్లు సమాచారం.
అనంతరం ఎస్సై వెంకటేష్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డబ్బు డిమాండ్ చేసిన ఆధారాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ప్రజల్లో చర్చనీయాంశం : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం వ్యవహారంలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అక్రమ సంబంధం కేసును సర్దుబాటు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
